హైదరాబాద్: ఆనాదిగా తెలంగాణ రైతులు వాడే యాస నేడు తెలంగాణ సర్కారు అధికారికంగా వాడుకలోకి తెచ్చింది. ఇంతకుముందు ఖరీఫ్, రబీ పేర్లను వానాకాలం, యాసంగిగా మారుస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇకముందు పంట సీజన్లలో ఖరీఫ్, రబీ పదాలను రద్దు చేస్తున్నట్లు, సామాన్య ప్రజానీకానికి సైతం అర్ధమయ్యే రీతిలో వ్యవసాయ కాలాలు ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖాపరమైన ఉత్తర్వులలో సైతం వానాకాలం, యాసంగి అని పిలవాలని వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు, కార్పోరేషన్లు, వ్యవసాయ శాఖ కార్యాలయాలకు సూచన చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.