రిపబ్లిక్ డే పరేడ్ లో తెలంగాణ ప్రైడ్

ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాలకు సంబంధించి తెలంగాణకు కేంద్రం శుభవార్త తెలిపింది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి రాష్ట్రానికి సంబంధించిన  శకటం ఎంపికైంది.

Last Updated : Dec 20, 2019, 09:24 AM IST
రిపబ్లిక్ డే పరేడ్ లో తెలంగాణ ప్రైడ్

ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాలకు సంబంధించి తెలంగాణకు కేంద్రం శుభవార్త తెలిపింది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి రాష్ట్రానికి సంబంధించిన  శకటం ఎంపికైంది. గణతంత్ర దినోత్సవం జనవరి 26న రాజ్‌పథ్‌పై మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రూపకాన్ని తెలంగాణ కళాకారులు ప్రదర్శించనున్నారు. దీనితో పాటు తెలంగాణ సంస్కృతికి కీర్తి కిరీటంగా నిలిచిన వేయి స్థంభాల గుడి, బతుకమ్మ ప్రాధాన్యతలు కూడా శకటంపై కొలువుదీరనున్నాయి.

 
 

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఆకృతి
ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ఆయా రాష్ట్రాల సాంస్కృతిక వైభవాన్ని శకటాలపై ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. అదే కోవలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరుసటి ఏడాదికి .. అంటే  2015లో  అవకాశం లభించింది. తొలిసారిగా తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఉన్న ‘బోనాలు’ రూపకాన్ని తెలంగాణ కళాకారులు నాడు ప్రదర్శించారు. ఆ తర్వాత బతుకమ్మ, మేడారం జాతరకు సంబంధించిన ఆకృతిని తయారుచేసినా చివరి దశలో ఎంపిక కాలేదు. ఆ తర్వాత ప్రతీ ఏటా వివిధ ఆకృతుల్లో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే శకట నమూనాలను పంపిస్తున్నా..  కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలోని సెరిమోనియల్ కమిటీ దృష్టిని ఆకర్షించలేకపోయింది. ఇప్పుడు మేడారం జాతర, బతుకమ్మ, వేయి స్థంభాల గుడి ఆకృతిలో రూపొందించిన శకటం ఎంపికైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది రెండవసారి అవకాశం లభించడం విశేషం. ఇది తెలంగాణ ప్రజలకు సంతోషం కలిగించే విషయం.

Trending News