ఫేస్‌బుక్‌కి బిలియన్ డాలర్లు తెచ్చిపెడుతున్న ఇండియన్ టెక్కీ !

ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో టెక్నాలజి దిగ్గజాలుగా పేరొందిన పలు బహుళ జాతి సంస్థల అధిపతులుగా మన భారతీయులు రాజ్యమేలుతున్న సంగతి తెలిసిందే.

Last Updated : Jan 1, 2018, 03:44 PM IST
ఫేస్‌బుక్‌కి బిలియన్ డాలర్లు తెచ్చిపెడుతున్న ఇండియన్ టెక్కీ !

ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో టెక్నాలజి దిగ్గజాలుగా పేరొందిన పలు బహుళ జాతి సంస్థల అధిపతులుగా మన భారతీయులు రాజ్యమేలుతున్న సంగతి తెలిసిందే. సుందర్ పిచ్చాయ్, సత్య నాదెళ్ల లాంటి వారు తమ తమ సంస్థలని సక్సెస్‌ఫుల్‌గా ముందుండి నడిపిస్తున్న సంగతి గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగే, ఈమార్కెటర్.కామ్ ప్రకటించిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో యూజర్లు కలిగిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఫేస్‌బుక్‌కి ప్రకటనల రూపంలో భారీగా బిలియన్ డాలర్లు సంపాదించిపెడుతున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కూడా ఇంకెవరో కాదు.. మన భారతీయుడే అని తెలుస్తోంది. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న వత్సల్ మెహతానే ఆ ఇండియన్ టెక్కీ. 

శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఫేస్‌బుక్ ప్రధాన కార్యాలయంలో యాడ్ రెవిన్యూ టీమ్‌ని ముందుండి నడిపిస్తున్న వత్సల్ మెహతాకు కచ్చితంగా ఆ కంపెనీ రుణపడి వుంటుంది. ఎందుకంటే 2010లో ఫేస్‌బుక్ యాడ్స్ మొదలైనప్పుడు ఆ విభాగాన్ని ముందుండి నడిపించింది మెహతా ఒక్కడే. ఒకే ఒక్కడితో మొదలైన ఆ విభాగంలో ఇప్పుడు దాదాపు 100 మందికిపైగా పనిచేస్తున్నారు. సరిగ్గా ఏడేళ్ల తర్వాత... అంటే ప్రస్తుతం ఫేస్‌బుక్ సొల్యుషన్స్ డైరెక్టర్‌గా ఆ సంస్థకు డబ్బులు తెచ్చిపెడుతున్న విభాగాన్ని లీడ్ చేస్తూ సక్సెస్‌ఫుల్ టెక్కీల్లో ఒకరిగా పేరు, ప్రఖ్యాతలు సొంతం చేసుకోవడం విశేషం. 

ఈమార్కెటర్.కామ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఒక్క అమెరికాలోనే 2017 మూడవ త్రైమాసికానికి ఫేస్‌బుక్ 17.37 బిలియన్ డాలర్స్ యాడ్ రెవిన్యూ రూపంలో సొంతం చేసుకుంది. అంతేకాకుండా 2018లో 21.57 బిలియన్ డాలర్లు, 2019లో 25.56 బిలియన్ డాలర్ల మొత్తంలో లాభాలు పొందుతామని ఆ సంస్థ ఆశిస్తోంది. ఇదే విషయమై స్పందించిన వత్సల్ మెహతా.. ఏడేళ్ల క్రితం ఫేస్‌బుక్ యాడ్స్ ప్రయోగం ప్రారంభించినప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా, ఎంతో ఛాలెంజింగ్‌గా వుందని అన్నారు. 

ప్రస్తుతం ఇంటర్నెట్ ట్రాఫిక్ అంతా స్మార్ట్ ఫోన్ ద్వారానే కావడంతో తమ దృష్టి అంతా మొబైల్ వైపే వుంది. కాకపోతే మారుతున్న ట్రెండ్స్‌ని ఎప్పటికప్పుడు అందుకోవడానికి చాలామంది అడ్వర్టైజర్స్ సిద్ధంగా లేరు. అందుకే వారికి తగిన సహాయం అందించడం కోసమే తమ బృందాన్ని మరింత విస్తరించుకున్నట్టు తెలిపారు మెహతా. అందుకే ప్రకటనల రూపంలో ఫేస్‌బుక్‌కి భారీగా రాబడి తెచ్చిపెడుతున్న వత్సల్ మెహతాకు ఆ సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ రుణపడే వుంటాడనేది కొంతమంది అభిప్రాయం. 

Trending News