Munugode Bypoll: పెద్ద కులపోడే పదవులు చేయాలా! బూర, కర్నె కామెంట్ల కలకలం.. టీఆర్ఎస్ పై బీసీల తిరుగుబాటేనా?

Munugode Bypoll:  మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అధికార పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందనే వార్తలు వస్తున్నాయి. అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడం,మంత్రి జగదీశ్ రెడ్డి తీరే ఇందుకు కారణమని తెలుస్తోంది.

Written by - Srisailam | Last Updated : Sep 27, 2022, 01:39 PM IST
  • మునుగోడు టీఆర్ఎస్ లో చిచ్చు
  • కర్నె ప్రభాకర్ హాట్ కామెంట్స్
  • టీఆర్ఎస్ పై బీసీల తిరుగుబాటు?
Munugode Bypoll: పెద్ద కులపోడే పదవులు చేయాలా! బూర, కర్నె కామెంట్ల కలకలం.. టీఆర్ఎస్ పై  బీసీల తిరుగుబాటేనా?

Munugode Bypoll:  మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అధికార పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందనే వార్తలు వస్తున్నాయి. అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడం,మంత్రి జగదీశ్ రెడ్డి తీరే ఇందుకు కారణమని తెలుస్తోంది. బీసీ లీడర్లను ఆయన అణగదొక్కుతున్నారనే ఆరోపణలు అధికార పార్టీకి మైనస్ గా మారుతున్నాయి. నియోజకవర్గంలో బీసీ వాదం బలంగా ఉంది. అయినా పార్టీలు బీసీ నేతలకు టికెట్లు ఇవ్వలేదు. దీనిపైనే బీసీలు గుర్రుగా ఉండగా.. మంత్రి జగదీశ్ రెడ్డి తీరు అగ్నికి గాలి తోడైనట్లుగా ఉందనే చర్చ సాగుతోంది. రెండు నెలలుగా మునుగోడులో తిరుగుతున్న మంత్రి..  బీసీ లీడర్లను అవమానిస్తున్నారనే టాక్ ఉంది. నియోజకవర్గంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశాలకు బీసీ నేతలకు ఆహ్వానం అందలేదు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ప్రభుత్వ మాజీ విప్ కర్నె ప్రభాకర్ కే దిక్కు లేదంటే మిగితా బీసీ నేతలు పరిస్థితి ఏంటో ఊహించవచ్చు.

కర్నె ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు మునుగోడులో కలకలం రేపుతున్నాయి. బీసీలు అధికార టీఆర్ఎస్ పార్టీపై తిరగబడుతున్నారా అన్న చర్చ సాగుతోంది. మునుగోడు నియోజకవర్గంలో చాకలి ఐలమ్మ  విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు కర్నె. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన హాట్ కామెంట్స్ చేశారు.  చిన్న కులాల వారే పోరాటం చేయాలా.. పెద్ద కులపోడే పదవులు అనుభవించాలా అని వ్యాఖ్యానించారు. పెద్ద కులపోడే రాజ్యాధికారం చేయాలని ఎక్కడైనా ఉందా అంటూ కామెంట్ చేశారు.చిన్న కులం, పెద్ద కులం అంటూ కర్నె ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు మునుగోడులో సంచలనంగా మారాయి. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై ఆగ్రహంతోనే కర్నె ఇలా కామెంట్ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తాజాగా మాజీ బూర నర్సయ్య గౌడ్ కూడా సంచలన కామెంట్లు చేశారు. పార్టీ కార్యక్రమాలను కూడా సొంత కార్యక్రమాలు లాగా అనుకుంటే వాళ్లకు నష్టం తప్పదన్నారు. బూర నర్సయ్య గౌడ్ ని పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి పిలవకపోవడం అంటే మునుగోడు నియోజకవర్గం ప్రజలను అవమానించడమే అన్నారు. మునుగోడు టికెట్ అనేది అంత ముఖ్యమైనది కాదన్న బూర.. 6 నెలల పదవి కోసం ఇంత  అవసరం లేదన్నారు. ఒకాయన పిలవనంత మాత్రాన నా స్థాయి తగ్గదు, వారి స్థాయి పెరగదు అంటూ పరోక్షంగా మంత్రి జగదీశ్ రెడ్డిని టార్గెట్ చేశారు. అహంకారం అనేది వారి సొంత సమాధికి పునాది లాంటిదన్నారు. వ్యక్తిగత ఆహ్వానాలు, చిల్లర రాజకీయాలకు కొరకు తాను ఉండనన్నారు.తనకు కేసీఆర్ ఒక్కరే  నాయకుడని.. మిగతా లిల్లీపుట్స్ ను పట్టించుకోనని స్పష్టం చేశారు బూర నర్సయ్య గౌడ్.

మునుగోడు నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లలో 67 శాతం మంది బీసీ ఓటర్లే. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మరో 24 శాతం ఉన్నారు. బీసీలు ఎక్కువగా ఉన్నా ఇప్పటివరకు మునుగోడు నుంచి బీసీ నేత ఎమ్మెల్యే కాలేదు. అందుకే ఈసారి బీసీ వాదం బలంగా వినిపిస్తోంది. బూర నర్సయ్యగౌడ్, కర్నె ప్రభాకర్, నారబోయిన రవి , కర్నాటి విద్యాసాగర్ మునుగోడు టికెట్ ఆశించారు. అయితే మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఉన్నారు. కూసుకుంట్ల కోసం గల్లీ గల్లీ తిరుగుతున్నారు. అయితే ప్రచారంలో ఆయన బీసీ లీడర్లను కలుపుకుని పోవడం లేదు. మండలాల వారీగా నిర్వహించిన ఆత్మీయ సమావేశాలకు వాళ్లను పిలవలేదు. తనకు పార్టీ సమావేశాలకు ఆహ్వానం అందడం లేదని ఇటీవలే బూర నర్సయ్య గౌడ్ ఓపెన్ గానే చెప్పారు.

మాజీ ఎంపీ బూర, కర్నె ప్రభాకర్ తమకు పిలుపు లేదని చెబుతున్నా  మంత్రి తీరు మాత్రం మారలేదని అంటున్నారు.  బూర,  కర్నె ప్రభాకర్ లు భవిష్యత్ లో తనకు మంత్రి పదవికి పోటీ వస్తారనే భయంతోనే జగదీశ్ రెడ్డి ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగదీశ్ రెడ్డి తీరుపై ఆగ్రహంగా ఉన్న బీసీ సంఘాలు.. ఉప ఎన్నికలో తమ సత్తా చూపిస్తామని హెచ్చరిస్తున్నాయి.  స్థానికంగా ఉండే బీసీ నేతలు ప్రకటనలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నె ప్రభాకర్ చేసిన తాజా వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీపై బీసీలు తిరుగుబాటు చేయబోతున్నారనే చర్చ సాగుతోంది. టికెట్ ఇవ్వకపోయినా కనీసం సమావేశాలకు పిలవకపోవడం ఏంటనే ఆగ్రహం బీసీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న మంత్రి జగదీశ్ రెడ్డికి బీసీల సత్తా ఏంటో చూపిస్తామంటున్నాయి. బీసీ సంఘాలు.

Read Also: Bimbisara Girl in God Father: బింబిసారకి గాడ్ ఫాదర్ కి ఉన్న కనెక్షన్ ఏమిటో తెలుసా?

Read Also: Rajasthan Crisis: 92 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా?  బీజేపీ చేతికి రాజస్థాన్.. ఇక మిగిలింది ఛత్తీస్ గడ్ ఒక్కటే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News