స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్: భరతమాత ముద్దుబిడ్డలను మనమూ స్మరించుకుందాం...!

భరతమాతను బ్రిటీష్ సామ్రాజ్యాధికారుల నుండి దాస్యవిముక్తి గావించడం కోసం ఎందరో వీరాధివీరులు, మహనీయులు తమ ప్రాణాలొడ్డి జీవితాలను అర్పించారు. అందులో చక్రవర్తులు, సాయుధ వీరులు, యువకులు.. ఎందరో దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలనే త్యాగం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అలాంటి గొప్ప వీరుల్లో పలువురి గురించి మనం కూడా తెలుసుకుందాం..!

Last Updated : Aug 14, 2018, 10:13 PM IST
స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్:  భరతమాత ముద్దుబిడ్డలను మనమూ స్మరించుకుందాం...!

భరతమాతను బ్రిటీష్ సామ్రాజ్యాధికారుల నుండి దాస్యవిముక్తి గావించడం కోసం ఎందరో వీరాధివీరులు, మహనీయులు తమ ప్రాణాలొడ్డి జీవితాలను అర్పించారు. అందులో చక్రవర్తులు, సాయుధ వీరులు, యువకులు.. ఎందరో దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలనే త్యాగం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అలాంటి గొప్ప వీరుల్లో పలువురి గురించి మనం కూడా తెలుసుకుందాం..!

ఝాన్సీ లక్ష్మీబాయి -  1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించిన వీరనారీమణి ఝాన్సీ లక్ష్మీబాయి. ఓ రాజ్యాధినేతగా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన రాణీ లక్ష్మీబాయి.. ఆ తర్వాత తిరుగుబాటు దళాల సహాయంతో బ్రిటీష్ సేనలను అడ్డుకుంది. ఆమెకున్న ధైర్యము, పరాక్రమము, మరియు వివేకము, భారతదేశంలో 19వ శతాబ్దములో మహిళలకున్న అధికారం పై ఆమెకున్న ముందుచూపు, మరియు ఆమె చేసిన త్యాగాలు ఆమెని స్వాతంత్ర్య పోరాటంలో ఒక ప్రసిద్ధ వ్యక్తిగా నిలిపాయి.

భగత్ సింగ్ - భారత స్వాతంత్ర్యోద్యమములో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో భగత్ సింగ్ ఒకరు. ఈ కారణంగానే ఆయనను షహీద్ భగత్ సింగ్‌గా ఆయన అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. యువకుడిగా ఉన్నప్పుడే సామ్యవాద భావాలపై అభిరుచి ఏర్పరచుకొన్న ఆయన ‘నా జీవితం దేశానికి అంకితం చేయాలనుకుంటున్నాను... నాకు ఇంకే కోరిక లేదు’ అని తల్లిదండ్రులకు లేఖ రాసి మరీ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నవజవాన్ భారత సభ అనే సంఘంలో చేరి.. ఆ తర్వాత కొందరు యువకులతో కలసి ఒక జట్టుగా ఏర్పడి లాలా లజపతిరాయ్ మరణానికి కారణమైన బ్రిటీష్ అధికారి సాండర్స్‌ని కాల్చి చంపాడు. 1930 మార్చి 23న భగత్ సింగ్‌ను ఉరితీశారు. 

సుభాష్ చంద్ర బోస్ - మీ రక్తాన్ని ధారపోయండి.. మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను.. అనే నినాదంతో ఎందరో యువతీ యువకులను స్వాతంత్ర్య ఉద్యమం దిశగా ప్రేరేపించి.. వారితో కలిసి ఇండియన్ నేషనల్ ఆర్మీ ద్వారా బ్రిటీష్ సేనలపై తిరుగుబాటు చేసిన యోధుడు సుభాష్ చంద్రబోస్. 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించబడిన బోస్.. అనేకసార్లు బ్రిటీష్ వారి కళ్లు కప్పి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆగష్టు 18, 1945లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో బోస్ మరణించాడని అంటారు. అయితే ఆ మరణ రహస్యం మీద ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. 

చంద్రశేఖర్ ఆజాద్ - పదిహేనేళ్ల వయసులో స్వాతంత్ర్య సంగ్రామం వైపు మొగ్గు చూపిన చంద్రశేఖర్ ఆజాద్.. తన స్నేహితుడైన రాంప్రసాద్ బిస్మిల్ మాటలతో ప్రేరేపితుడై దేశం కోసం ప్రాణాలు ఇచ్చైనా సరే.. భరతమాతకి దాస్యవిముక్తి గావించాలని భావించాడు. భగత్ సింగ్, సుఖ్ దేవ్ మొదలగు వారితో కలిసి హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ స్థాపించాడు. 24 ఏళ్ల ప్రాయంలో స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ అధికారులకు వ్యతిరేకంగా పోరాడి..  ప్రాణాలు పోయేవరకూ అనితర సాధ్యమైన ధైర్య సాహసాలతో పోరాటం సాగించి చిరస్మరణీయుడైనాడు ఆజాద్. 

మంగళ్ పాండే - 34వ బెంగాల్ రెజిమెంట్‌లో ఒక సిపాయిగా పనిచేసిన మంగళ్ పాండే... ప్రప్రథమ స్వాతంత్ర్య సమర యోధుడుగా ఘనతకెక్కాడు. సుమారు రెండు శతాబ్దాలు మన దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని పరిపాలించిన బ్రిటిష్ వారిపై యుద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్ర్య సమర యోధుడు మంగళ్ పాండే . అప్పటివరకూ బ్రిటిష్ వారి అరాచకాలు, అవమానాలను మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్ర్యాల వైపు మళ్లించిన ఘనత మంగళ్ పాండేదే. 

అల్లూరి సీతారామరాజు - భారతదేశ స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక తిరుగులేని శక్తి. ఆంధ్రదేశంలో ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొని అసువులు బాసిన ధీరోదత్తుడు. 

అష్ఫాఖుల్లా ఖాన్ - 'నా మాతృభూమిని ఆంగ్లేయుల శృంఖలాల నుంచి విముక్తం చేయాలనుకున్నాను. నా త్యాగం వృథా కాదు. మరెందరో త్యాగధనులకు స్ఫూర్తినిస్తుంది. నా హిందూస్థాన్ స్వేచ్ఛా వాయువులు పీలుస్తుంది. చాలా త్వరగా బానిస సంకెళ్ళు తెగి పోతాయి. దేశంలోని ఏడు కోట్ల ముస్లింలలో దేశ స్వాతంత్య్రం కోసం ఉరికంబాన్ని ఎక్కబోతున్న మొట్ట మొదటి అదృష్టవంతుడుగా గర్వపడుతున్నాను' అని చెప్పిన యువపోరాట యోధుడు అష్ఫాఖుల్లా ఖాన్. అతివాద ఉద్యమకారులతో కలిసి పోరాటం చేసిన ఈ దేశభక్తున్ని 1927, డిసెంబర్ 19న బ్రిటీష్ అధికారులు ఉరితీశారు. 

మహాత్మ గాంధీ -  సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన ఆయుధాలు. వాటితోనే ఆయన జాతిని మొత్తం ఏకతాటిపైకి తీసుకొచ్చి, దేశభక్తులందరినీ ఏకం చేసి.. జాతిపితగా ఘనతకెక్కారు.  రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశాన్ని వదిలి వెళ్లడంలో ప్రధాన పాత్ర పోషించారు.

వీర పాండ్య కట్టబొమ్మన్ - పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన వీర పాండ్య కట్టబొమ్మన్‌ తమిళనాడులోని పంచలన్‌ కురిచి తెగకు చెందిన యోధుడు. ఇతను బ్రిటిష్‌ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి.. తమిళనాట తెల్లదొరల  అరాచకాలకు అడ్డుకట్ట వేశాడు. 1799లో బ్రిటిష్‌ సేనలు కయతార్‌ ప్రాంతంలో ఆయనను అరెస్టు చేశారు. పాండ్యన్‌ను అక్టోబరు 16 వరకు విచారణలో ఉంచి, ప్రజల సమక్షంలో ఉరితీశారు.

కల్పనా దత్తా - భారత దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో బెంగాల్ ప్రాంతంలోని చిట్టగాంగ్ జిల్లాకు ఒక ప్రాధాన్యత ఉంది .అక్కడే కల్పనా దత్తా అనే వీరనారీమణి బ్రిటీషర్లకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసి చరిత్రకెక్కారు. ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ తరఫున సూర్య సేన్ అనే స్వాతంత్ర్య యోధునితో కలిసి పనిచేసిన కల్పనా దత్త, ఎందరో మహిళా విప్లవకారులను తయారుచేశారు. 
 

Trending News