Telangana Govt Schemes: ప్రజా ప్రభుత్వం మరో రికార్డు నెలకొల్పింది. ఒకే రోజు నాలుగు సంక్షేమ పథకాలను విజయవంతంగా ప్రారంభించటంతో పాటు.. అక్కడికక్కడే 6,15,677 మంది అర్హులకు లబ్ధి కల్పించింది. అదే రోజున రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఆర్థిక శాఖ రూ.579 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగానే ప్రజా పాలనలో నాలుగు సంక్షేమ పథకాలు విజయవంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజునే లక్షలాది మంది ఈ సంక్షేమ పథకాలను అందుకున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఎంపిక చేసిన 563 గ్రామాల్లో ఈ పథకాలను ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది.
ఆయా గ్రామాల్లో ఉన్న రైతులకు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆర్థిక సాయాన్ని అప్పటికప్పుడే వారి ఖాతాల్లో జమ చేసింది. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేసింది. గూడు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందించింది. రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న కుటుంబాలకు కొత్త కార్డులు జారీ చేసింది. పాత కార్డుల్లో అదనంగా సభ్యులను నమోదు ప్రక్రియను పూర్తి చేసింది.
మొదటి రోజునే రాష్ట్ర ప్రభుత్వం రూ.569 కోట్ల రైతు భరోసా విడుదల చేసింది. మొత్తం 32 జిల్లాల్లో 563 గ్రామాలలో 4,41,911 మంది రైతులకు ఎకరానికి రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. ఒక్క రోజులోనే మొత్తం రూ.569 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసింది. మొదటి రోజునే 9,48,333 ఎకరాల విస్తీర్ణంలోని భూమికి రైతు భరోసాను చెల్లించింది. 26వ తేదీన బ్యాంకులకు సెలవు దినం కావటంతో 27వ తేదీ ఉదయం నుంచి ఈ రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి.
తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. మొదటి విడతగా రూ.6 వేలు చెల్లించింది. తొలి రోజున దాదాపు 18180 వేల వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఈ నగదు సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకానికి తొలి రోజునే ఆర్థిక శాఖ రూ.10.91 కోట్లు విడుదల చేసింది.
గత పదేండ్లుగా కొత్త రేషన్ కార్డులకు ఎదురుచూసిన తెలంగాణ ప్రజల నిరీక్షణ ఫలించింది. ప్రజా ప్రభుత్వం అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు జారీ ప్రారంభించింది. వీటితో పాటు పాత రేషన్ కార్డుల్లో అదనపు కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసింది. తొలి రోజున 531 గ్రామాల్లో 15414 కొత్త కార్డులు ఇచ్చింది. వీటిలో 51912 మంది కుటుంబ సభ్యులు లబ్ధి పొందారు. వీటితో పాటు అదనపు సభ్యులను చేర్చాలంటూ 1.02 లక్షల మంది కార్డుదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఏళ్లకేళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించింది. ఇప్పటికే ఉన్న కార్డుల్లో అదనంగా 1,03,674 మంది కుటుంబ సభ్యులను నమోదు చేసింది. వచ్చే నెల నుంచి వీరికి రేషన్ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయనుంది. గూడు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో తొలి రోజునే అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తం 72 వేల మంది పేదలకు ఇళ్ల పత్రాలను అందించింది.
Also Read: SEBI Chief: సెబీ చీఫ్ పోస్టుకు రిక్రూట్ మెంట్..ఫిబ్రవరి 17వ తేదీ చివరి గడువు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి